బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఉదయపూర్లో టైలర్ను మతోన్మాదులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలన రేపింది. అయితే టైలర్ కన్హయ్యలాల్ హత్యకు వారం రోజుల ముందే మహరాష్ట్ర కొల్హేలో కెమిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు.
అయితే ఆ హత్య వెనక ఉగ్రకుట్ర ఉన్న విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కెమిస్ట్ ఉమేష్ హత్యను ఎన్ఐఏకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నూపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన అమరావతి వాసి ఉమేశ్ ప్రహ్లాదరావ్ కొల్హే హత్యను జాతీయ దర్యాప్తు సంస్థ‘ఉగ్ర చర్య’గా అభివర్ణించింది. దేశంలోని ఓ వర్గం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న లక్ష్యంతోనే కొల్హేను హతమార్చారని ఎఫ్ఐఆర్లో తెలిపింది. మృతుడి కుమారుడు సంకేత్ ఫిర్యాదు మేరకు ఉపా సహా పలు సెక్షన్ల కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన యూసుఫ్ఖాన్ తమకు 2006 నుంచి తెలుసని కొల్హే సోదరుడు మహేశ్ కొల్హే చెప్పారు. తన సోదరుడు, ఖాన్ మంచి స్నేహితులని, ఒకే వాట్సాప్ గ్రూపులో సభ్యులని వెల్లడించారు. అయితే కొల్హే హత్యలో ప్రధాన సూత్రధారి ఇర్ఫాన్ ఖాన్ను ఈనెల 7 వరకు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఇర్ఫాన్ ఖాన్ ఓ ఎన్జీఓ డైరెక్టర్ అని, ఆ స్వచ్ఛంద సంస్థ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముదాసర్ అహ్మద్ అలియాస్ సోను రజా షేక్ ఇబ్రహీం, షారుక్ పఠాన్ అలియాస్ బాద్షాషా హిదాయత్ ఖాన్, అబ్దుల్ తౌఫిక్ అలియాస్ నాను షేక్ తస్లీమ్, షోయబ్ ఖాన్ అలియాస్ భూర్య సబీర్ ఖాన్, అతిబ్ రషీద్ ఆదిల్ రషీద్, డా. యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్ను అరెస్టు చేశారు. ఇందులో నలుగురు ఇర్ఫాన్ ఖాన్ స్నేహితులు. వీరంతా.. అతడి ఎన్జీఓ కోసమే పనిచేస్తున్నట్లు తెలిసింది. అరెస్టైన వారిలో ఒకరైన యూసుఫ్ ఖాన్ వెటర్నరీ డాక్టర్.. చనిపోయిన కోల్హే వెటర్నరీ మెడికల్ షాప్ ఓనర్. ఈ ఇద్దరికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వెటర్నరీ డాక్టర్స్ గ్రూప్ను క్రియేట్ చేశారు కోల్హే. యూసుఫ్ ఖాన్ కూడా ఇందులో ఓ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమేశ్ కోల్హే.. నుపుర్ శర్మకు మద్దతుగా ఆ గ్రూప్లో పోస్ట్ చేయగా.. కొందరికి ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యూసుఫ్ ఖాన్ హత్యకు కుట్ర పన్ని.. మిగతా వారిని ప్రేరేపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. యూసుఫ్ ఖాన్, ఉమేశ్ కోల్హే మంచి స్నేహితులు అని.. కోల్హే అంత్యక్రియలకు కూడా యూసుఫ్ ఖాన్ హాజరయ్యారని వెల్లడించారు.
మరోవైపు.. ఎన్ఐఏ అధికారికంగా ఇంకా కెమిస్ట్ హత్య కేసు విచారణను తమ నియంత్రణలోకి తీసుకోలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కేసు బదిలీకి సంబంధించి.. ఎన్ఐఏ నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని ల్లడించారు. అయితే.. శనివారమే జాతీయ దర్యాప్తు సంస్థ కేసు విచారణ కోసం రంగంలోకి దిగినట్లు కేంద్ర హోం శాఖ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. మరోవైపు.. జాతీయ దర్యాప్తు సంస్థ ఇర్ఫాన్ ఖాన్ను ఇప్పటికే విచారించిందని కూడా తెలిసింది. ఇక మెడికల్ షాప్ యజమాని హత్య చాలా దారుణమైన ఘటన అని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ సంబంధాలపై కూడా పరిశీలిస్తోందన్నారు. ఈ కేసులో సూత్రధారిని పట్టుకున్నారని.. ఏదైనా అంతర్జాతీయ సంబంధం ఉందా అనేది త్వరలోనే ఎన్ఐఏ తేలుస్తుందని ఆయన తెలిపారు. దీనిని మొదట దొంగతనం కేసుగా చిత్రీకరించారని.. దానిపై కూడా విచారణ జరుగుతుందని వెల్లడించారు.
మరోవైపు.. ఉదయ్పుర్ దర్జీ కన్హయ్యలాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టైన నలుగురు నిందితులు వాడిన ఫోన్లలో.. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటెయిల్స్ రికార్డ్స్ను ఎన్ఐఏ విశ్లేషిస్తుంది. కరాచీ కేంద్రంగా నడిచే.. దావత్-ఇ-ఇస్లామీ మతపర సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. అయితే.. వీరిలో ఒకరికి జేఈఐతో దగ్గరి సంబంధాలున్నాయని కేంద్ర సంస్థ అనుమానిస్తోంది. జూన్ 28న దర్జీ కన్హయ్యను అతడి షాపులోనే దారుణంగా కొందరు దుండగులు చంపారు. ఈ ఘటన నిందితులకు బీజేపీతో సంబంధం ఉందని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. కన్హయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు.. బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. మరోవైపు.. ఇవి నిరాధారమైనవని తిప్పికొట్టింది బీజేపీ.