తమిళనాడులోని శివకాశిలో ఆలయ రాజగోపురానికి మంటలు అంటుకున్నాయి. శివకాశిలోని విరుధునగర్లో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజగోపురం చుట్టూ కట్టెలతో ఓ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆలయ సమీపంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఆ సమయంలో కాల్చిన టపాసులు రాజగోపురానికి ఉన్న ఆ కట్టెల నిర్మాణంపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని క్రమంగా కింది వరకు వ్యాపించాయి. గుర్తించిన భక్తులు ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.