పాకిస్తాన్లో ఉగ్రవాదులు చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటన అప్పర్ కోహిస్తాన్లో చోటు చేసుకుంది. దాసు డ్యామ్ నిర్మాణ పనులకు ఓ బస్సులో 30 మంది చైనా ఇంజినీర్లు, వర్కర్లు వెళ్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం మొత్తం 13 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సులో బాంబులు అమర్చారా? లేక రోడ్డు పక్కన అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది.

ఈ బస్సు పేలుడుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చైనా పాక్ ను కోరింది. చైనా ఇంజినీర్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చైనా ప్రభుత్వం డిమాండ్ చేసింది. చైనా ఇంజినీర్ల మృతుల పట్ల చైనా ప్రభుత్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. “ఎగువ కోహిస్తాన్లో చైనా ఇంజనీర్లను తీసుకెళ్తున్న బస్సులో భారీ పేలుడు సంభవించింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు” అని హజారా ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాయిటర్స్ మీడియాతో చెప్పారు. పేలుడు రోడ్డు పక్కన పెట్టిన పరికరం వల్ల జరిగిందా.. బస్సు లోపల ఉంచినదో వెంటనే స్పష్టంగా తెలియలేదు. పేలుళ్ల ధాటికి బస్సు లోయలోకి పడిపోయింది. ఒక చైనా ఇంజినీర్, మరో సైనికుడు తప్పిపోయారు. వీరి ఆచూకీ కోసం బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. “పేలుడు తరువాత బస్సు లోతైన లోయలో పడిపోవడంతో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఒక చైనా ఇంజనీర్ మరియు ఒక సైనికుడు తప్పిపోయారు. సహాయక చర్యలు ప్రారంభించబడింది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని రక్షించడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోంది” అని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ నిర్మాణ కార్మికులు దాసు జలవిద్యుత్ ప్రాజెక్టుపై కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ సంస్థ ఈ ఉగ్రదాడికి పాల్పడిందో ఇంకా తెలియరాలేదు.

దాసు జలవిద్యుత్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) లో భాగం. బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద 65 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టారు. ఇది పశ్చిమ చైనాను దక్షిణ పాకిస్తాన్లోని గ్వాడార్ సముద్ర ఓడరేవుతో అనుసంధానించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్మిస్తూ ఉన్నారు. చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ నిర్మాణ కార్మికులు దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో బీజింగ్ పాక్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అయితే పాకిస్తాన్ లో చైనా కార్మికుల భద్రత చాలాకాలంగా ఆందోళన కలిగిస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి, నిర్మించడానికి పెద్ద సంఖ్యలో చైనా పౌరులు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు.
