కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని అన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు లేదన్నారు.. అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని అన్నారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్లతో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లతో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మర్రి శశిధర్రెడ్డి త్వరలో పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఒకటి రెండు రోజుల్లోనే రాజీనామా చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమేనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.