తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పికి గురైన ఆయన హైదరాబాద్ లోని సూరారంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు తన కొడుకుని ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించారని.. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని.. తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని… కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామని.. కష్టపడి సంపాదించి, నిజాయతీగా బతుకుతున్నామని చెప్పారు. బీజేపీ కేంద్ర వ్యవస్థలతో అక్రమంగా దాడులు చేయిస్తోందని, రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సూరారంలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ. 4 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.