లవ్లీనా సెమీఫైనల్ కు చేరుకోగానే ఆమెకు పతకం గ్యారెంటీ అని అర్థమైపోయింది. అయితే లవ్లీనా సెమీఫైనల్ ను దాటి స్వర్ణం కోసం పోరాడుతుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. లవ్లీనా సెమీ ఫైనల్ లో ఓటమి పాలైంది. బుధవారం జరిగిన సెమీ-ఫైనల్లో మహిళల వెల్టర్ (64-69 కేజీలు) విభాగంలో టాప్ సీడ్ టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలి చేతిలో లవ్లీనా ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. లవ్లీనా బుసేనాజ్ ముందు నిలవలేకపోయింది. 5:0 తో టర్కీ బాక్సర్ విజయం సాధించింది. దీంతో లవ్లీనా కాంస్యం సొంతం చేసుకుంది. జర్మనీకి చెందిన నాడిన్ అపెట్జ్పై లవ్లీనా కఠినమైన రౌండ్-16 పోటీలో విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో, లవ్లీనా 4: 1 తేడాతో చైనీస్ తైపీకి చెందిన నియన్-చిన్ చెన్పై విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. సెమీస్ లో మాత్రం లవ్లీనా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఆమె చూపించిన తెగువ మాత్రం అమోఘం. ఆమె కాంస్యంతో భారత్ కు తిరిగి రానుంది.
భారత రెజ్లర్లు దీపక్ పూనియా, రవికుమార్ దహియా లు సెమీస్లోకి ఎంటర్ అయ్యారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్లో బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్పై 14-4 స్కోర్తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టాడు. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్పై రవి విజయం సాధించాడు. 23 ఏళ్ల రవికుమార్ తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగినా ప్రతి రౌండ్లోనూ రవికుమార్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. సెమీస్లో కజికిస్తాన్కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.45కు జరుగుతుంది.
86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో దీపక్ పూనియా సెమీస్లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్లో అతను చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్పై 6-3 స్కోర్తో దీపక్ గెలిచాడు. ఉదయం ప్రీ క్వార్టర్స్లో నైజీరియా రెజ్లర్ ఎకెరికెమి అగియోమోర్ను ఓడించాడు. టెక్నికల్ సుపీరియార్టీ పద్ధతిలో 12-1 స్కోర్ తేడాతో బౌట్ను దీపక్ గెలుచుకున్నాడు. మహుహరి మెస్సి స్టేడియంలో జరిగిన రెజ్లింగ్ పోటీలో.. దీపక్ పూనియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. సెమీస్లో డేవిస్ మోరిస్తో దీపక్ తలపడనున్నాడు.