ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో 101 మంది కరోనా కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది కన్నుమూయగా, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 14,35,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,15,683 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 9 గంటలవరకు లేదా 6 గంటల నుంచి 10 గంటల వరకు కుదించే విషయాన్ని పరిశీలిస్తోంది. సోమవారం అధికారులు, పలువురు మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు.