పాకిస్తాన్ లో పోలీసు వ్యవస్థ గురించి, అక్కడి చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! ఎన్నో దేశాలలో తీవ్రవాద చర్యలకు పాల్పడిన వారు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే.. ఇక మూక హత్యలు, కుటుంబ సభ్యులను చంపిన వారికి ఎటువంటి శిక్షలు వేయడం లేదు. కొద్ది సంవత్సరాల కిందట ఖందీల్ బలోచ్ అనే సోషల్ మీడియా స్టార్ ను సొంత సోదరుడే హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడు ఒప్పుకున్నాడు కూడా..! అయితే ఇప్పుడు అతడు నిర్దోషి అని విడుదలవ్వడం హాట్ టాపిక్ గా నిలిచింది.
సోమవారం (ఫిబ్రవరి 14), లాహోర్ హైకోర్టు (LHC) ఖందీల్ బలోచ్ హంతకుడైన ముహమ్మద్ వాసిమ్ను అన్ని అభియోగాల నుండి నిర్దోషిగా ప్రకటించింది. బలోచ్ (అసలు పేరు ఫౌజియా అజీమ్) ఒక మోడల్.. సోషల్ మీడియా స్టార్ తమ పరువు తీస్తోందనే కోపంతో జూలై 15, 2016న ఆమె సోదరుడు వసీం మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. ముల్తాన్ మోడల్ కోర్టు 2019 సెప్టెంబర్లో వసీమ్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక మేజిస్ట్రేట్ ముందు నేరస్థుడు తన నేరాన్ని నమోదు అంగీకరించాడు. కుటుంబానికి చెడ్డపేరు తెచ్చినందుకు తన సొంత సోదరిని చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.6 సంవత్సరాల కన్నా తక్కువ సమయం జైలు జీవితం గడిపిన తర్వాత, ఇప్పుడు లాహోర్ హై కోర్ట్ అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ విషయాన్ని నేరస్తుడి తరపు న్యాయవాది సర్దర్ మహూబ్ ధృవీకరించారు. తన సోదరిని చంపినందుకు అతని తల్లిదండ్రులు క్షమించడంతో పాటూ, సాక్షులు వారి వాంగ్మూలాలను ఉపసంహరించుకోవడంతో వసీం నిర్దోషిగా విడుదలయ్యాడు. పాకిస్తాన్ శిక్షాస్మృతి (PPC)లోని సెక్షన్ 311 కింద నిందితుడు దోషిగా నిర్ధారించబడ్డాడని, ఫిర్యాదుదారు/బాధితుడు ఒక నిందితుడిని క్షమించిన తర్వాత అతడికి క్షమాభిక్ష తమ చట్టాలలో ఉందని న్యాయవాది సర్దర్ మహూబ్ తెలిపారు.
వసీమ్ మరియు అతని ఇద్దరు కుమారులు అస్లాం, ఆరిఫ్లపై మొదట హత్య కేసు నమోదు చేసింది అతని తండ్రి ముహమ్మద్ అజీమ్ బలోచ్. ఆగస్టు 2019లో వసీమ్ను ఖందీల్ బలోచ్ తల్లిదండ్రులు క్షమించారు. ముల్తాన్ ట్రయల్ కోర్టు ప్రధానంగా వసీం ఒప్పుకోవడంపైనే ఆధారపడి ఉందని, అయితే చాలా మంది ప్రాసిక్యూషన్ సాక్షులు పోలీసులేనని, ప్రస్తుత చట్టం ప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదని హంతకుడి తరపు న్యాయవాది చెప్పారు. ట్రయల్ కోర్టు వసీం తల్లిదండ్రుల ‘క్షమాపణ’ను విస్మరించి, నేరారోపణతో ముందుకు సాగిందని అన్నారు.
2016లో చనిపోడానికి ముందు ఖందీల్ బలోచ్ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ లో తనకు అభద్రతా భావం ఉందని తెలిపింది. చంపుతామని బెదిరింపులు కూడా చేశారని తెలిపింది. ఆ సంవత్సరం ఈద్-ఉల్-ఫితర్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి విదేశాల్లో స్థిరపడాలని భావించింది. బాధితురాలికి వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు.