ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు. మోదీజీ వెనక్కి పోవాలంటూ హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టారని.. వీటిని చూస్తుంటే టీఆర్ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు. కేసీఆర్ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కుష్బూ అన్నారు. వారసత్వ రాజకీయాలను సహించేది లేదని ఖుష్బూ చెప్పారు.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అది ప్రజలే చూస్తారని ఖుష్బు స్పష్టం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. షెడ్యుల్ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా మోదీ హైదరాబాద్ కు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. హెచ్ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ స్థలిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలను వ్యక్తులను పలు ప్రాంగణాలకు నామకరణం చేశారు. హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రదేశానికి శాతవాహన నగరంగా, సమావేశ నగరానికి కాకతీయ నగరంగా నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మగా, మీడియా హాల్కు షోయబ్ బుల్లాఖాన్ హాల్ అని, అతిథులు బస చేసే ప్రాంగణాలకు సమ్మకసారలమ్మ నిలయంగా నామకరణం చేశారు.