More

    కేటీఆర్-రేవంత్ రెడ్డి ట్విట్టర్ వార్.. ఏకంగా కోర్టుల్లో కేసుల దాకా

    గత కొద్దిరోజులుగా ట్విట్టర్ లో డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

    దీనిపై స్పందించిన కేటీఆర్…‘‘నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను…రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?…ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ…ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?…రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా’’ అని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విసిరిన సవాల్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, తమతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధపడాలని ఆయన షరతు పెట్టారు.

    ఇక ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని… అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా కోర్టు శిక్షకు అర్హులు అవుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    సినీ ప్రముఖులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ ను డ్రగ్స్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తాగు బోతులకు… కేటీఆర్‌ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరోలకు డ్రామా రావు దోస్తు కాదా? అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.

    Related Stories