తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే..! తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ భారతీయ జనతా పార్టీపై ఛార్జిషీట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని అన్నారు. ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులమని అన్నారు. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుందని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణకు ఎనిమిదేళ్లలో ఏం చేశామో, భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పి తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎనిమిదేళ్లలో ఏ వర్గానికి మేలు చేయకుండా.. ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనను, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ .. తాము ప్రజల తరపున కేంద్రంపై చార్జీషీట్లు వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూళనను పట్టించుకోలేదని, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని, మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. నిధులు ఇవ్వనందుకు తాము చార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ, హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశారని, యార్న్ పై సబ్సిడీ రద్దు చేసినందుకు కేంద్రంపై చార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు. ఇంకా పలు అంశాలపై తాము చార్జీషీట్లు వేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.