తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టీఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున పార్టీ నాయకులు మీడియా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని.. దొంగల మాటలను టీఆర్ఎస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకమని.. ఆ డ్రామా చూస్తుంటే నవ్వు వస్తోందంటూ ఎద్దేవా చేశారు.