శ్రీలంక సిరీస్ లో ఉన్న భారత జట్టులోని ఆటగాడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు జరగాల్సిన టీ20 మ్యాచ్ వాయిదా పడింది. కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడంతో భారత్-శ్రీలంకల మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఇతర ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ అని తేలితే నేటి మ్యాచ్ ను రేపు నిర్వహించే అవకాశం ఉంది. పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఇరు జట్లు వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాలని ఆదేశాలు అందాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లందరి కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు వారు ఐసొలేషన్ లోనే ఉండనున్నారు. కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో… పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ల ఇంగ్లండ్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లండ్ తో సిరీస్ కోసం లండన్ లో ఉన్న భారత ఆటగాళ్లలో ముగ్గురు గాయాల బారిన పడటంతో వీరిద్దరినీ ఇంగ్లండ్ కు పంపుతున్నట్టు బీసీసీఐ నిన్న ప్రకటించింది. ప్రస్తుతం వీరు శ్రీలంకలోనే ఉన్నారు. ఇప్పుడు వీరికి కరోనా నెగెటివ్ అని తేలితేనే ఇంగ్లండ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్ లో కూడా వీరిద్దరూ 10 రోజుల పాటూ ఐసోలేషన్ లో ఉండనున్నారు.
ఇక మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావించిన భారత్ కు కరోనా మహమ్మారి రూపంలో అడ్డు ఎదురైంది. మిగిలిన ఆటగాళ్లందరికీ నెగటివ్ రావాలని.. కృనాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.