కోడికత్తి అంశం.. గతంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి/ అప్పటి ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు.. నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి లేఖ రాశారు. తన కుమారుడిని గత నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో కానీ, ఎన్ఐఏ విచారణ కానీ జరగడం లేదని చెప్పారు. 2018లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని హైదరాబాద్ కు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి జగన్ చేరుకున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమయింది.