కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ… రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరని అన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తారక్ తో అమిత్ షా కలిసి ఉంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి మోదీ, అమిత్ షా ద్వయం ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని, ఇందులో భాగంగానే ఎన్టీఆర్, అమిత్ షాల భేటీ జరిగి ఉండొచ్చని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారని, ఆయన సేవలను దేశ వ్యాప్తంగా బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
మునుగోడు సభలో పాల్గొనేందుకు తెలంగాణ వచ్చిన అమిత్ షా, ఆదివారం రాత్రి ఢిల్లీకి తిరిగి బయలుదేరే ముందు శంషాబాద్ పరిధిలోని నోవాటెల్ హెటల్లో ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు.
బీజేపీకి నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సమావేశమని.. ఎన్టీఆర్తో అమిత్ షా భేటీలో వారిద్దరూ కేవలం సినిమాలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డిన్నర్ చేయాలని అమిత్ షా భావించారన్నారు.