కన్నడ నటుడు మోహన్ జునేజా కన్నుమూశారు. కేజీఎఫ్ సినిమాలో ‘మాంస్టర్’ డైలాగ్ తో తెలుగు సినీ అభిమానులకు కూడా పరిచయమయ్యారు. గతకొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చిక్కబాణవర సప్తగిరి ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో మోహన్ జునేజా జన్మించారు. బెంగళూరులోనే విద్యాభ్యాసం చేసి అక్కడే స్థిరపడ్డారు. కన్నడలో ‘జోగి’ చిత్రంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు.సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించారు. బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. ఆయన మరణించారనే వార్త ప్రేక్షకులను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు శాండల్ వుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.