కేరళ.. కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 50శాతం పైగా ఒక్క కేరళలోనే నమోదవుతూ ఉన్నాయి. బక్రీద్ పండుగ కోసం నిబంధనలను సడలించి కేరళ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేరళ పర్యాటక విభాగం.. తమ రాష్ట్రంలో పర్యటించండి అంటూ ప్రకటనలను గుప్పించడం తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. “If you have not planned a trip to the backwaters, hillstations or beaches in Kerala, #AreYouEven a traveller?” అంటూ ట్వీట్లు చేసింది. ‘#GetReadyForKerala’ ‘#KeralaTourism’ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ఉంచారు. దీంతో నెటిజన్లు కౌంటర్లు వేస్తూ ఉన్నారు. మొదట కరోనా కేసులను కంట్రోల్ చేయండి.. ఆ తర్వాత వస్తాము అని చెప్పారు. వ్యతిరేకత రావడంతో కేరళ టూరిజం ట్విట్టర్ ఖాతా నుండి ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 46 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దాంట్లో 58 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మిగితా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటిందని అన్నారు. ఇక మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీల్లో లక్ష లోపే కేసులు ఉన్నాయన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 51 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలో 16 శాతం కేసులు ఉన్నట్లు తెలిపారు. మిగితా రాష్ట్రాలన్నీ కేవలం 5 శాతం లోపే ఉన్నట్లు చెప్పారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారు.. మరో 607 మంది బాధితులు వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మొత్తం 4,36,365 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,33,725 ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.03శాతమని, రికవరీ రేటు 97.63శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 60.38 డోసులు పంపిణీ చేసింది ప్రభుత్వం. కేరళలో 31,445 పాజిటివ్ కేసులు నమోదవగా.. 215 మంది మృత్యువాతపడ్డారు.