టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించినవారిలో ఉన్నారు. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేసినట్లుగా సమాచారం. మూడు స్థానాల కోసం సుమారు పది మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి.
దీవకొండ దామోదర్ రావు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన వారు. తెలంగాణ పబ్లికేషన్స్(నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు) కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుండి కేసీఆర్ వెంట ఉన్నారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ, ఫైనాన్స్గా వ్యవహరించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథిరెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకులు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన పార్థసారథిరెడ్డి డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానెట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర. రవి చంద్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు.