కశ్మీరీ పండిట్లపై జమ్మూ కశ్మీర్ లో ఎన్నో ఏళ్లుగా దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో కశ్మీరీ పండిట్ ను తీవ్రవాదులు కాల్చి చంపారు. జమ్ముకాశ్మీర్లో గంటవ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మెడికల్ స్టోర్ యజమానినే కాకుండా మరో ఇద్దరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఇక్బాల్ పార్క్లోని బింద్రూ మెడికేట్ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్ అయిన లాల్ బింద్రూ (70) అతని ఫార్మశీ దుకాణంలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1990 నుండి ఆయన మెడికల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకునేందుకు యత్నించగా అయితే అప్పటికే ఉగ్రవాదులు పారిపోయారు. ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా తీవ్రవాదులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రూను పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చారు. 1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ ఒకరు.

శ్రీనగర్ శివారులోని హవల్ ప్రాంతంలో భేల్పూరి విక్రయిస్తున్న స్థానికేతరుడైన వీధి వర్తకుడు వీరేందర్ను తీవ్రవాదులు కాల్చి చంపారు. రెండో దాడి జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాందీపుర జిల్లాలో ఉగ్రవాదులు మూడోదాడికి పాల్పడ్డారు. నయిద్ఖాయ్ ప్రాంతంలో స్థానిక ట్యాక్సీ స్టాండ్ అధ్యక్షుడైన మహమ్మద్ షఫీ లోనెను కాల్చిచంపారు.
అనుమానితుల అరెస్ట్:
కుప్వారా జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్వారాలోని కర్నా ఏరియాలో సఫీర్ అహ్మద్ షేక్, జమీర్ హుస్సేన్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరి వద్ద ఎనిమిది హ్యాండ్ గ్రనేడ్లు, ఒక పిస్తోల్, ఏడు రౌండ్లు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.