ఐపీఎల్ మ్యాచ్ లు ఎప్పుడు ఏ సమయంలో ఎలా మారిపోతాయో అసలు ఊహించలేము..! ఆఖరి బంతి వరకూ మ్యాచ్ ఎవరైనా నెగ్గే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు థ్రిల్లర్ ను చూపించింది. భారత్ యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి అద్భుతమైన బౌలింగ్ వేసి రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించాడు. మొదట్లో క్యాచ్ లు వదిలేసి తప్పులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.. ఆఖరి రెండు ఓవర్లలో అద్భుతం చేసి చూపించారు. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో విజయం చివరికి రాజస్థాన్నే వరించింది. ఆఖరి ఓవర్ లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్ తొలి బంతికి పంజాబ్కు పరుగేమీ రాలేదు. రెండో బంతికి ఓ పరుగు వచ్చింది. ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయానికి మూడు పరుగులు కావాలి. మూడో బంతికి పూరన్ అవుటయ్యాడు. అయినా, ఇంకా మూడు బంతులు మిగిలి ఉన్నాయి కాబట్టి గెలుపుపై పంజాబ్ ధీమాగా ఉంది. త్యాగి వేసిన నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. దీంతో టెన్షన్ మరింత పెరిగింది. ఐదో బంతికి మళ్లీ వికెట్. దీంతో పంజాబ్ డగౌట్లో కలవరం. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా కార్తీక్ వేసిన చివరి బంతికి పరుగేమీ రాలేదు. దీంతో అనూహ్యంగా రాజస్థాన్ను విజయం వరించింది. విజయం అందినట్టే అంది చేజారడంతో పంజాబ్ షాక్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 2 పరుగుల దూరంలో నిలిచింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. రాజస్థాన్ ఆటగాళ్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోరు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. లూయిస్ (36), జైశ్వాల్ (49), లివింగ్ స్టోన్ (25) క్రీజులో ఉన్నంత సేపు వేగంగా పరుగులు సాధించారు. ఇక లోమ్రోర్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసాడు. అయితే అర్షదీప్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ (49), మయాంక్ అగర్వాల్ (67) చెలరేగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాహుల్ కు వచ్చిన లైఫ్ లు సద్వినియోగం చేసుకుని మొదటి వికెట్ కు వంద పరుగులకు పైనే భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరి ఓవర్లో ఒత్తిడికి గురైన పంజాబ్ చేజేతులా మ్యాచ్ ను కోల్పోయింది. మార్కరమ్ అజేయంగా 26 పరుగులు చేయగా పూరన్ 32 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి రెండు వికెట్లు తీసుకోగా, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్ను అద్భుతంగా వేసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించి పెట్టిన కార్తీక్ త్యాగికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్లో నేడు ఢిల్లీ కేపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.