బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉమేశ్ కత్తి కన్నుమూత

0
760

కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ కత్తి వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే పల్స్ ఆగిపోయినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

బెళగావి జిల్లా హుక్కేరి తాలూకాలోని బెల్లాబ్‌బాగేవాడిలో జన్మించిన ఉమేశ్ కత్తి హుక్కేరి నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణం తర్వాత ఉమేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. మంత్రి ఉమేశ్ కత్తి మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్ఘాంతపోయారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె.సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉమేశ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. “ఉమేష్ కత్తి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో తరలిస్తారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన తర్వాత అన్ని ప్రక్రియలు జరుగుతాయి. బాగేవాడి బెలగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ రోజు బెలగావిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.” అని ఆయన మీడియాతో అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్నారయణ్‌ సిఎన్‌ మాట్లాడుతూ ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిపారు. గుండెపోటు కారణంగా, ఆయన ప్రాణాలను కోల్పోయాడని తెలిపారు.