ఎస్యూవీ కారుని బుక్ చేసుకోవడానికి కార్ షోరూమ్కి వెళ్లిన కర్ణాటక రైతును సేల్స్ ఎగ్జిక్యూటివ్లు బయటకు పంపించేశారు. ముప్పై నిమిషాల తర్వాత రైతు తాను కొనాలనుకున్న కారును కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలతో షోరూమ్కు తిరిగి వచ్చాడు. దీంతో కార్ షో రూమ్ సిబ్బంది షాక్ అయింది. తాము చాలా తప్పు చేశామని గుర్తించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా రమణపాళ్యకు చెందిన కెంపేగౌడ అనే రైతును కార్ షోరూమ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవమానించారు. దీంతో డబ్బుల కట్టలు తెచ్చి షోరూమ్ సిబ్బంది ముందు పెట్టాడు. ‘అడిగిన డబ్బు కట్టా. తక్షణం కారు డెలివరీ చేయండి’ అంటూ డిమాండ్ చేశాడు.
కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి ఓ కార్ల షోరూమ్కు వెళ్లాడు. బొలేరో పికప్ వెహికిల్ కావాలని అడిగాడు. అతడి వేషభాషలను, వెంటనున్న మిత్రబృందాన్ని చూసిన షోరూమ్ సిబ్బంది వాళ్లను తక్కువగా అంచనా వేసి.. సరిగా స్పందించలేదు. అతడిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కెంపెగౌడ కారు ఖరీదెంత అని సిబ్బందిని అడిగాడు. పదిలక్షలని ఆఫీసర్ సమాధానమిచ్చాడు. డబ్బు కడితే వెంటనే కారు డెలివరీ చేస్తారా? అని అడిగాడు. ముందు డబ్బుతో రా అంటూ సమాధానం రావడంతో అక్కడి నుండి కెంపెగౌడ వెనుదిరిగాడు.
అరగంటలో కెంపెగౌడ తిరిగి వచ్చి.. సేల్స్మన్ టేబుల్ ముందు అవసరమైన డబ్బును పెట్టాడు. కారు డెలివరీ చేయాలని కోరాడు. షోరూమ్ సిబ్బంది వెంటనే డెలివరీ ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. కెంపెగౌడ మిత్ర బృందం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మాకు వాహనం వద్దు.. అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలి’ అని కెంపెగౌడ పోలీసులతో అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కెంపెగౌడ మీడియాతో మాట్లాడుతూ, “అప్పటికి బ్యాంకులు మూతపడి ఉన్నందున మేము అంత నగదును సేకరించలేమని షో రూమ్ సిబ్బంది భావించింది. రైతు అరగంట తర్వాత నగదుతో కార్ షోరూమ్కు తిరిగి వచ్చాడు. కానీ షోరూమ్ కారును డెలివరీ చేయలేకపోయింది.” అని తెలిపారు. కెంపెగౌడ, అతని స్నేహితులు తమకు ఎదురైన అవమానానికి కోపంతో ఉన్నారు. ఫిర్యాదు నమోదు చేసేందుకు పోలీసులకు ఫోన్ చేశారు. షోరూం నుంచి వెళ్లేందుకు కూడా నిరాకరించారు. తిలక్ పార్క్ పోలీస్ స్టేషన్లోని పోలీసు సిబ్బంది రైతును, అతని స్నేహితులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లేలా ఒప్పించవలసి వచ్చింది. తనను, తన స్నేహితులను అవమానించినందుకు షోరూమ్ నుండి లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. “నన్ను మరియు నా స్నేహితులను అవమానపరిచినందుకు సేల్స్ ఎగ్జిక్యూటివ్, షోరూమ్ అధికారులను లిఖితపూర్వకంగా మాకు క్షమాపణలు చెప్పాలని కోరాను. ఇప్పుడు, నేను వాహనం కొనడానికి ఆసక్తిని కోల్పోయాను” అని కెంపెగౌడ చెప్పుకొచ్చాడు.