కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను మే 13వ తేదీన ప్రకటించనున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ చేపట్టనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. ఏప్రిల్ 24వ తేదీ అభ్యర్థుల విత్డ్రాకు చివరి తేదీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 25,282 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం పంచకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 2,400 సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 171 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించనున్నట్టు సీఈసీ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే పెద్ద మొత్తంలో కర్ణాటకలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నగదుతో పాటు చీరలు, కుక్కర్లు, కిట్లు, హాట్ బాక్స్లు ఇతరు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.