గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలిచిన సినీ నటి కరాటే కల్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియాలో తనపై అసత్య కథనాలు వస్తున్నాయని, సినిమా వాళ్లకు చిన్నారిని అమ్ముకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. మౌక్తిక అనే చిన్నారిని తాను ఇంకా దత్తత తీసుకోలేదని, పాపకు ఇంకా ఏడాది కూడా నిండలేదని అన్నారు. లీగల్ గా చెల్లుబాటు కాకపోవడంతో ఇంకా దత్తత తీసుకోలేదని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తిచేస్తానని తెలిపారు. తాను ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. తాను పారిపోయే రకం కాదని, పరిగెత్తించే రకం అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చారు. కావాలనే తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, దీనివెనుక శివశక్తి అనే సంస్థ ఉందని ఆరోపించారు.
ఇటీవల కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందంటూ ఫిర్యాదులు అందాయి. దాంతో చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు కరాటే కల్యాణి నివాసంలో సోదాలు జరిపారు. ఆ సమయంలో కరాటే కల్యాణి అక్కడ కనిపించలేదు. ఆమె ఇంటికి వెళ్లిన అధికారుల బృందం.. పాప గురించి వివరాలు ఎంక్వైరీ చేసింది. ఆమె చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకుందా అనే విషయంపై ఆరాతీశారు. పలు డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు. కరాటే కల్యాణి అక్రమంగా దత్తత తీసుకున్నట్టు తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తాను మాత్రం ఇంకా దత్తత తీసుకోలేదని మీడియా సమావేశంలో కరాటే కల్యాణి తెలిపింది. కరాటే కల్యాణి మీడియా సమావేశంలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు.