సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. 50వ సీజేఐగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2024 నవంబర్ 10 వరకు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలను నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న బాధ్యతలను స్వీకరించారు. పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన భాగస్వామిగా ఉంటూ కీలక తీర్పులను వెలువరించారు. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా పని చేశారు. భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత ఆయనది.
నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ లలిత్ ను తదుపరి సీజేఐని సూచించాలంటూ కేంద్రం కోరింది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న వారినే సీజేఐగా ఎంపిక చేస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా జస్టిస్ చంద్రచూడ్ పేరును జస్టిస్ లలిత్ సిఫారసు చేశారు. అయోధ్య భూ వివాదం కేసు, గోప్యత హక్కు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసులకు సంబంధించిన ధర్మాసనాల్లో ఉన్నారు.