బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన నడ్డా విజయవాడ చేరుకున్నారు. సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభలో నడ్డా ప్రసంగించారు. విజయవాడలో శక్తి కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆయుష్మాన్ భారత్ పేరిట ఓ బృహత్తర ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తోందని.. అదే పథకానికి ఆరోగ్యశ్రీ అని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చిందని ఆయన ఆరోపించారు. ఈ పథకం ముమ్మాటికీ జగన్ది కాదని, ఈ పథకం మోదీదని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రం దాటితే చెల్లదని, ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా అమలు అవుతుందన్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని ఆయన అన్నారు. బూత్ల వారీగా ప్రజలకు పార్టీని చేరువ చేసే బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని.. పార్టీ కార్యకర్తలతో బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బూత్ కమిటీలలో అన్ని వర్గాలకు స్థానం దక్కేలా చూడాలని.. అలా చేస్తే బీజేపీ ఏ ఒక్క వర్గానికి మాత్రమే పరిమితం కాదన్న సందేశాన్ని జనంలోకి పంపాలని ఆయన కోరారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని.. ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలనిజేపీ నడ్డా అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.