ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, పలువురు అగ్రనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. గత ఏడాది కోవిడ్ సంక్షోభం తలెత్తిన అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కావడం ఇదే మొదటి సారి. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం ఎన్డీఎంఎస్ కార్యాలయానికి చేరుకోగానే ఛాత్ సంప్రదాయాలతో స్వాగతం పలికిన మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సభావేదికపై ప్రధానిని తోడ్కొని వచ్చి గజమాల వేయడంతో సమావేశం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వర్చువల్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా బెంగాల్ రాజకీయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఇక బీజేపీ రాజకీయం వేరుగా ఉంటుందన్నారు. అత్యుత్తమ పాలన అందించేందుకు వీలుగా పార్టీ ఆర్గనైజేషన్ పటిష్టతకు శ్రేణులు కృషి చేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్ను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం సిక్కుల కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు. 1984 అల్లర్ల నిందితులపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు.
జాతీయ కార్యవర్గం సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ కోవిడ్ వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మోదీ జీ.. టీకాల కోసం ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు, ఈ రోజు మనం దాని ఫలితాన్ని చూస్తున్నామని అన్నారు. 9 నెలల్లో 1 బిలియన్ డోస్లు టీకాలు వేశామని అన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం, పాటు పలు తీర్మానాలు ఆమోదించడంపై సమావేశం సాగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని.. పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదని అన్నారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని అన్నారు. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.