జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూ ఉంది. కశ్మీర్లోని కుల్గాం జిల్లా ఖండిపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు శనివారం కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్లో సాగుతున్న టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల శ్రేణిలో పలువురు ఉగ్రవాదులు, వారి కమాండర్లు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు జరిపాయి. శుక్రవారం జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యం చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో బారాముల్లాలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తో సంబంధం ఉన్న ఇద్దరు క్రియాశీల ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
“నిర్దిష్ట సమాచారం రావడంతో వెంటనే చర్య తీసుకున్న పోలీసులు, ఆర్మీతో కలిసి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఇటికి చెందిన ఇద్దరు యాక్టివ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు, అబ్దుల్ రెహ్మాన్ మీర్ కుమారుడు ఇర్షాద్ అహ్మద్ మీర్, బషీర్ అహ్మద్ కుమారుడు జాహిద్ బషీర్, ఇద్దరూ బారాముల్లా లోని నేహల్పోరా పట్టాన్ ప్రాంతంలో నివసిస్తున్నారు” అని అధికారిక ప్రకటన పేర్కొంది.