More

    కిరీటం ఒక్కటే తక్కువ.. రాజకీయాలు రాచరికపు వ్యవస్థను తలపిస్తున్నాయి: పవన్

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు పేర్లు పెట్టుకుంటున్నారని.. వాళ్లెవరూ దేశం కోసం పనిచేయలేదని విమర్శించారు. ప్రజల సంపాదన పన్నుల రూపంలో కడితే పథకాలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారని.. సంపాదన మనది, పేరు వారిదని అన్నారు. ఆ పథకాలను పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు వంటి జాతీయ నాయకుల పేర్లు ఎందుకు పెట్టరని పవన్ నిలదీశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పథకాలకు జాతీయ నేతల పేర్లు పెడతామని స్పష్టం చేశారు.

    రాజకీయ నేతలు అంటే పేకాట క్లబ్బులు నడిపేవారు, సూట్ కేసు కంపెనీలతో కోట్లు దోచుకునేవారు కాదని అన్నారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో భావితరాల కోసం పనిచేసే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన పార్టీ కోరుకుంటోందని తెలిపారు. కిరీటం ఒక్కటే తక్కువ అని, ప్రస్తుత రాజకీయాలు రాచరికపు వ్యవస్థను తలపిస్తున్నాయని అన్నారు. రాజకీయం అంటే వారి ఇళ్లలో పిల్లలకు వారసత్వంగా కట్టబెట్టడం అన్నట్టుగా తయారైందని.. నాటి నాయకులు జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చి సర్వస్వం అర్పిస్తే, ఈతరం నాయకులు ప్రజల ఉమ్మడి ఆస్తులు కొల్లగొట్టి, తమ ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ స్వతంత్ర దినోత్సవ సమయాన తాను కోరుకునేది ఒక్కటేనని, స్త్రీకి భద్రత ఉన్న సమాజం కావాలని అన్నారు. యువతకు వారి భవిష్యత్ నిర్మించుకోగలిగే వ్యవస్థ కావాలని, విద్యావ్యవస్థ వారి కాళ్లపై వారు నిలబడగలిగేలా సత్తా ఇచ్చేదిగా ఉండాలని ఆకాంక్షించారు. మీరు ఇచ్చే రూ.5 వేల జీతానికి వలంటీర్లు గానో, సిమెంటు ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకో వారి చదువులు పనికొచ్చేట్టయితే అలాంటి విద్యావ్యవస్థ సరిపోదని అన్నారు. లక్షలు ఆర్జించే, వ్యాపారాలు నిర్మించే సామర్థ్యం అందించగల విద్యావ్యవస్థ కావాలని స్పష్టం చేశారు.

    జనసేన-బీజేపీ నేతల సమన్వయ కమిటీ శనివారం రాత్రి విజయవాడలో సమావేశమైంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక పరమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుతెన్నులు, నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి వెళ్లిన ఫిర్యాదులపైనా సమావేశంలో చర్చించారు.

    Trending Stories

    Related Stories