దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు సర్పంచ్పై కాల్పులు జరిపారు. సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్ను వెంటనే కుల్గామ్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కశ్మీర్ లోయలో పంచాయతీ సభ్యుడు హత్యకు గురికావడం రెండు రోజుల్లో ఇది రెండో ఘటన. “సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్కు శ్రీనగర్లోని సురక్షితమైన హోటల్లో వసతి కల్పించారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హోటల్ నుండి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. పోలీసుల రక్షణలో ఉన్నవాళ్ళందరూ SOPని అనుసరించాలని సూచిస్తున్నాము” అని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపారు. “దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా ఒడౌరాలో మరో ప్రజా ప్రతినిధి హత్యకు గురయ్యాడు. తీవ్రవాదులు చేపట్టిన మరొక అనాగరిక, పిరికి పంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, అలాంటి దాడులను సహించేది లేదు. మీడియాలోని ఒక వర్గం నివేదించినట్లుగా షబీర్ కు బీజేపీతో అనుబంధం లేదు, ”అని J&K బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు. షబీర్ అహ్మద్ మీర్ భార్య నుస్రత్ కూడా సర్పంచ్. లోయలో ఇటీవల తీవ్రవాద ఘటనలు పెరుగుతున్నాయి. మార్చి 9న శ్రీనగర్ శివార్లలో ఉగ్రవాదులు మరో సర్పంచ్ సమీర్ అహ్మద్ భట్ను కాల్చి చంపారు. మార్చి 2న కుల్గామ్లో ఓ సర్పంచ్ హత్యకు గురయ్యాడు.
శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లలో ముగ్గురు తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్లో, హంద్వారా నెచమా, గందర్బాల్ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువ జామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ చెప్పారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్కు చెందిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. గందర్బల్ హంద్వారాలో జరిగిన ఎదురుకాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామన్నారు.