హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కేసులో ఐటీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు జరిపిన సోదాలు, సేకరించిన సాక్ష్యాధారాలకు సంబంధించి ఈడీకి పూర్తి నివేదిక సమర్పించింది. మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించిన ఐటీ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి రిపోర్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమర్పించింది. మెడికల్ సీట్ల, డోనేషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈకేసులో ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ తెలిపింది. మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరపాలని, అప్పుడే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు.
అక్రమాస్తులు కలిగా ఉన్నారంటూ ఐటీశాఖ మల్లారెడ్డి, ఆయన బంధువులు, ఇళ్లు, కార్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి, ఆయన కుటంబసభ్యులకు నోటీసులు పంపారు. కాగా విచారణలో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆడిటర్.. ఐటీ ఎదుట హాజరయ్యారు. మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్, డైరెక్టర్లను అధికారులు కూడా ప్రశ్నించారు. ఇప్పటికే.. కాలేజీ సీట్ల కేటాయింపులు, ఫీజుల వివరాలు సేకరించి సీట్ పేమెంట్ల బ్యాంక్ ఖాతాలపై కూపీ లాగారు. ఇప్పటివరకు జరిపిన సోదాలు, సేకరించిన సాక్ష్యాధారాలతో పూర్తి నివేదికను సిద్ధం చేసిన ఐటీ శాఖ దానిని ఈడీకి పంపింది.