అనుమానమే నిజమైంది. విశాఖలోని తూర్పు నౌకదళం అధికారులపై జరిగింది హనీ ట్రాపేనని.. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం వుందని.. NIA విచారణలో తేటతెల్లమైంది. నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర పన్నినట్టు తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీపై అభియోగాలు నమోదు చేస్తూ ఎన్ఐఏ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది 14మంది నిందితులపై అభియోగాలతో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా మరో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లయింది.
ఇమ్రాన్ తరచుగా పాకిస్తాన్ వెళ్లేవాడని, అక్కడి ఏజెంట్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఇందులో ఆరోపించింది. పాకిస్తాన్కు కీలక సమాచారం అందించేందుకు వీలుగా ఆయన కొందరు గూఢచారులను కూడా నియమించుకున్నట్లు ఆరోపించింది. ఇందులో భారత నౌకలు, జలాంతర్గాములు, ఇతర రక్షణ స్ధావరాల సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఏజెంట్ల ఆదేశాల మేరకు ఇమ్రాన్ నేవీ సిబ్బంది ఖాతాల్లోకి డబ్బు పంపినట్లు ఎన్ఐఏ అభియోగాలు మోపింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ మొదట్లో లేడీస్ టైలర్గా పనిచేసేవాడు. అయితే, అనారోగ్య కారణాలతో ఆ పని మానేశాడు. ఆ తర్వాత ఆటో నడిపేవాడు. ఈ క్రమంలో కరాచీ వస్త్రాలను భారత్కు దిగుమతి చేసే ముసుగులో.. మన దేశంలో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న అసఫ్తో అతనికి పరిచయమైంది. యాకూబ్ క్రమంగా అసఫ్ ట్రాప్లో పడ్డాడు. అతడు చెప్పిన పనులన్నీ చేసిపెట్టేవాడు. ఇందులో భాగంగా విశాఖపట్నం, కార్వర్, ముంబైల్లోని నేవీలో పనిచేసే ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశాడు. వారి నుంచి దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాల ఫోటోలు, వీడియోలు, ఇతర రక్షణ రహస్యాలు, వ్యూహాత్మక స్థావరాల వివరాలను సేకరించాడు. ఈ వివరాలను పాకిస్థాన్ నిఘా విభాగానికి ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. ఆ తర్వాత నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేవాడు. దీనికి అవసరమైన నిధులను యాకూబ్ వస్త్ర వ్యాపారం పేరుతో తీసుకొచ్చేవాడు. అతడికి పాకిస్థాన్లోని కరాచీలో బంధువులుండగా.. వారి ద్వారా అసఫ్ పరిచయమైనట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న అతడికి ఇంత భారీ మొత్తంలో డబ్బు పాకిస్థాన్ నుంచే అందినట్లు నిర్ధారించింది.
ఈ రాకెట్ కేసులో ఇప్పటికే అరెస్టయిన మహ్మద్ హరూన్, సాహిస్తా కైజర్లు ఇక్బాల్ దోబా అనే వ్యక్తితో సంబంధాలు కొనసాగించారని ఎన్ఐఏ తేల్చింది. పాకిస్థాన్కు చెందిన ఇక్బాల్ దోబాకు అసఫ్ ప్రధాన అనుచరుడని.. అతడే యాకూబ్ను హ్యాండ్లర్గా వినియోగించుకున్నాడని గుర్తించారు. యాకూబ్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిపారు. ఇక్బాల్ ఇంకా ఎంతమందితో సంబంధాలు కొనసాగించాడన్న దానిపైనా ఎన్ఐఏ ఆరా తీస్తోంది.
హనీ ట్రాప్తో దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా డబ్బు వచ్చినట్లు మొదట నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. తర్వాత కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించగా 2019లో కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురితో పాటు 11 మంది నేవీ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్ఐఏ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో గుజరాత్లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో రుజువైంది. దీంతో అతడిపై అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ.. దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించింది.