ముంబైలోని డోంబివ్లీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ కరెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ వాల్ట్ కస్టోడియన్ గా విధులు నిర్వర్తిస్తున్న అల్తాఫ్ షేక్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతను జూలై 9 న దోపిడీని అమలు చేసి తాను పని చేసే బ్యాంకు ఖజానా నుండి 34 కోట్ల రూపాయలను మాయం చేశాడు. పూణెకు చెందిన అల్తాఫ్ షేక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి సుమారు రూ.9 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని సోదరి నీలోఫర్, అతని ఇతర ముగ్గురు భాగస్వాములు, ఖురేషి, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు మూడు నెలల సమయం పట్టింది. నిందితులు ఈ దొంగతనాన్ని దాదాపు ఏడాది పాటు ప్లాన్ చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. స్పెయిన్ హీస్ట్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ మనీ హీస్ట్ నుండి ప్రేరణ పొందిన తరువాత సూత్రధారి అల్తాఫ్ షేక్ ఈ దోపిడీని అమలు చేసినట్లు వారు తెలిపారు.
అల్తాఫ్ షేక్ ఒక సంవత్సరం క్రితం ఈ సిరీస్ సిరీస్ను వీక్షించాడు. అతను గత 9 సంవత్సరాలుగా పని చేస్తున్న బ్యాంకును దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దోపిడీ చేసేందుకు కావాల్సిన సామాగ్రిని సేకరించాడు. ఓ రోజు బ్యాంక్ సేఫ్ రూమ్ దగ్గర ఏసీ రిపేర్ పనులను అల్తాఫ్ గమనించి అక్కడి నుంచి ప్లాన్ చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. అల్తాఫ్ షేక్ మొదట నేరానికి అవసరమైన పదార్థాలను సేకరించే ముందు భద్రతా వ్యవస్థలోని లొసుగులను పరిశోధించాడు. బ్యాంకు సెలవు రోజున జూలై 9న దోపిడీని అమలు చేశారు. షేక్, మొదట అలారం సిస్టమ్లను డిసేబుల్ చేసి, సీసీటీవీల హార్డ్ డిస్క్లన్నింటినీ తీసేశాడు. ఆ తర్వాత, అతను ఎయిర్ కండిషనింగ్ డక్ట్ ద్వారా దోపిడీని అమలు చేశాడు. బ్యాంకు భవనం వెనుక భాగంలో కట్టిన టార్పాలిన్పై ఏసీ డక్ట్లోని రంధ్రం ద్వారా డబ్బును విసిరాడు. “అలారం సిస్టమ్ను డియాక్టివేట్ చేసి, CCTVని ధ్వంసం చేసిన తర్వాత, షేక్ బ్యాంక్ వాల్ట్ను తెరిచి, నగదును డక్ట్ లో నుండి కిందకు పంపించాడు. సీసీటీవీల డీవీఆర్తోపాటు డబ్బులు కూడా మాయమైనట్లు బ్యాంకు గుర్తించిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది, దీంతో సిబ్బంది తనిఖీ బృందాన్ని పిలవాల్సి వచ్చింది” అని అధికారి తెలిపారు.
ఆ తర్వాత అతను తన ముగ్గురు సహచరులు ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరి, అతని సోదరి నీలోఫర్ సహాయం తీసుకున్నాడు, బ్యాంకు నుండి నగదును నవీ ముంబైలోని తలోజా వద్ద అద్దెకు తీసుకున్న ప్రదేశానికి తరలించాడు. పోలీసుల కథనం ప్రకారం, షేక్ తన ముగ్గురు సహచరులకు రూ. 12 కోట్లను అందజేసి, మిగిలిన నగదును నవీ ముంబైలోని తలోజాలో తన సోదరి నీలోఫర్తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంట్లో దాచాడు. ఆ తర్వాత, సీసీటీవీ రికార్డింగ్ల హార్డ్ డిస్క్లు దొంగిలించారని షేక్ బ్యాంక్కు సమాచారం అందించాడు. నగదు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత, పోలీసులు షేక్ ముగ్గురు సహాయకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చివరికి, రెండున్నర నెలల తరువాత, ముగ్గురు నిందితులు అందించిన సమాచారం ఆధారంగా చోరీకి సూత్రధారి అల్తాఫ్ షేక్ను పూణేలో అదుపులోకి తీసుకున్నారు. అల్తాఫ్ షేక్ మూడు నెలల పాటు పరారీలో ఉన్నాడు. బురఖాతో కూడా అతడు తిరుగుతూ వచ్చాడని పోలీసులు వెల్లడించారు. షేక్ సోదరి నీలోఫర్ తన ఇంట్లో కొంత డబ్బు దాచుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమెను కూడా అరెస్టు చేసి, కేసులో సహ నిందితురాలిగా అభియోగాలు మోపారు.