డ్రాగన్ దేశానికి భారత్ దడ పుట్టించనుంది. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ తన వంతుగా కృషి చేస్తుంది. ఇందులోభాగంగా ఐఎన్ఎస్ వగీర్ జలాంతర్గామిని జలప్రవేశం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశంగా ఈ జలాంతర్గామిని తయారు చేశారు. దీన్ని ముంబైలోని కల్వరి క్లాస్లో జలప్రవేశం చేసిన ఐదో జలాంతర్గామి కావడం గమనార్హం. నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ జలాంతర్గామితో భారత నౌకాదళం సామర్థ్యం మరింతగా బలోపేతం కానుంది.
ఫ్రాన్స్ నుంచి అందిపుచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ వాగిర్ను నావల్ స్టాప్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రారంభించారు. ఇది సముద్ర జలాల్లో శత్రువుల కదలికలను పసిగట్టడంతో పాటు దేశ సముద్ర ప్రయోజనాలను మరింతగా పెంచడానికి ఉపయోగపడుతుంది. యుద్ధ సమయాల్లో శత్రు యుద్ధ నౌకలను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతమని భారత నౌకాదళం వెల్లడించింది.
వగీర్ అంటే ఇసుకు సొరచేప. ఐఎన్ఎస్ వగీర్లో ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సార్లు ఉన్నాయి. వగీర్ ఆయుధ ప్యాకేజీలో తగిన వైర్ గైడెడ్ డార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని దెబ్బకొట్టేందుకు తగినన్ని ఉపరితల క్షిపణలు, ఉప-ఉపరితలం ఉన్నాయి. ఈ జలాంతర్గామి ప్రత్యేక కార్యకలాపాల కోసం మెరైన్ కమాండోలను కూడా ప్రారంభించగలదు. హిందూ మహా సముద్రంలో చైనా నావికాదళం ఉనికిని పెంచుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వగీర్ను ప్రారంభించడం సంతరించుకుంది.
ఐతే భారతదేశం నాలుగు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ నిర్మించాలని భావిస్తున్నారు. మొదటి నౌక ఐఎన్ఎస్ అరిహంత్ 2014లో సేవలోకి ప్రవేశించింది. ఇందులో మొత్తం INS అరిహంత్, INS అరిఘాట్ బోట్లు ఉన్నాయి. దీన్ని ఇండియాలోనే తయారు చేశారు. ఇది 83MW సుసంపన్నమైన యురేనియం-ఇంధన ఒత్తిడితో కూడిన లైట్-వాటర్ రియాక్టర్ ద్వారా శక్తిని పొందుతుంది. అరిహంత్-క్లాస్ సబ్మెరైన్లు 110 మీటర్ల పొడవు, 11 మీటర్ల బీమ్తో ఉంటాయి. నీటిలో 24 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయని నావి నివేదిక పేర్కొంది. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. దీని వెపన్స్ సిస్టమ్.. టార్పెడోలను అలాగే సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలవు.
అలాగే భారతదేశం ఆరు కల్వరి-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్లను నిర్మించాలని భావిస్తోంది. 2017లో ఈ తరగతిలోని మొదటి నౌకను ప్రారంభించారు. ఇందులో INS కల్వరి, INS ఖండేరి, INS కరంజ్, INS వేలా, INS వగీర్ ఉన్నాయి. వీటిని ఫ్రాన్స్, ఇండియాలో తయారు చేశారు. ఈ కల్వరి క్లాస్ ఫ్రాన్స్లోని స్కార్పెన్-క్లాస్ సబ్మెరైన్లపై ఆధారపడి ఉంటుంది. ఈ సబ్మెరైన్లు 67.5 మీటర్ల పొడవు, 6.2 మీటర్ల బీమ్తో ఉంటాయి. నీటిలో 20 నాట్స్ వేగంగా ప్రయాణించగలవు. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. వెపన్స్ సిస్టమ్ టార్పెడోలను, యాంటీ షిప్ మిసైల్స్ను ప్రయోగించగలవు.
ఇక భారతదేశం నాలుగు శిశుమార్ క్లాస్ నౌకలను నిర్వహిస్తోంది. అవి INS శిశుమార్, INS శంకుష్, INS షాల్కీ, INS శంకుల్. వీటిని వెస్ట్ జర్మనీ, ఇండియాలో తయారు చేశారు. ఈ సబ్ మెరైన్స్ 65 మీటర్ల పొడవు, 8 మీటర్ల బీమ్ కలిగి ఉంటాయి. మునిగిపోయినప్పుడు 22.5 నాట్స్ వేగంతో ప్రయాణించగలవని నివేదిక పేర్కొంది. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. టార్పెడోలను, వెపన్ సిస్టమ్ల నుంచి ఫైర్ చేయవచ్చు.
న్యూక్లియర్ థ్రెట్ కేపబిలిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది ఆపరేషనల్ సింధుఘోష్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అవి INS సింధుఘోష్, INS సింధు రాజ్, INS సింధు రత్న, INS సింధు కేసరి, INS సింధు కీర్తి, INS సింధు విజయ్, INS సింధు రాష్ట్ర. వీటిని సోవియట్ యూనియన్, రష్యాలో తయారు చేశారు. ఈ కిలో-క్లాస్ సబ్ మెరైన్లు భారతదేశ సబ్మెరైన్ నౌకాదళానికి వెన్నెముకగా పనిచేస్తాయి. Klub/3M-54E ఆల్ఫా క్రూయిజ్ మిసైల్ సిస్టమ్కు అనుగుణంగా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సబ్మెరైన్లు 72.6 మీటర్ల పొడవు, 9.9 మీటర్ల బీమ్ కలిగి ఉంటాయి. నీటిలోపల 18 నాట్స్ వరకు ప్రయాణించగలవు. సుమారు 45 రోజుల పాటు నీట మునిగి ఉండగలవు. వెపన్స్ సిస్టమ్ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్ను ప్రయోగించగలదు.