పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్కు ఇటీవల చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. విశ్వాస పరీక్షలో నెగ్గి తృటిలో పీఎం పీఠాన్ని కోల్పోయే పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతానికైతే తప్పించుకున్నాడు కానీ.. ప్రమాదం వెంటాడుతూనేవుంది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి ఇమ్రాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇమ్రాన్ పాలనపై ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఓవైపు సైన్యం, మరోవైపు ప్రజాగ్రహంతో ఎప్పుడు పదవి ఊడిపోతుందోనని క్షణాలు లెక్కపెట్టుకుంటున్నాడట.
ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఏం చేయాలో తెలియక.. ఇమ్రాన్ ప్రభుత్వం ప్రభుత్వ రాబడిని పెంచడమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచింది. నిత్యావసర వస్తువులను కూడా వదలకుండా ఎడాపెడా టాక్సులు వడ్డించింది. పన్నులు పెంచిన జాబితాలో కోడి గుడ్లు, మాంసం కూడా ఉన్నాయి. నిత్యవసర సరుకులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటితోపాటు చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చికెన్, మాంసం కాకుండా, గుడ్లు, అల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. రావల్పిండిలో గుడ్డు ధరలను డజనుకు 350 రూపాయలకు చేరింది. అదే సమయంలో ఇక్కడ కిలో అల్లం వెయ్యి రూపాయలు పలుకుతోంది. ఫ్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లలో ఏ నిత్యావసర వస్తువు ముట్టుకున్నా బగ్గుమంటోంది. నిత్యావసర ధరలు ఇలా మండిపోతుంటే.. కనీసం గంజి నీళ్లు కాచుకుందామన్నా.. గ్యాస్ కొరత అక్కడి ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. 2021 ప్రారంభం నుంచే పాకిస్తాన్ తీవ్రమైన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్కు గ్యాస్ సరఫరా చేసే ‘సూయి నార్తర్న్ గ్యాస్’ దేశం మొత్తానికి సరిపడే ఎల్పీజీ గ్యాస్ను సరఫరా చేయలేకపోతోంది. దీంతో పాకిస్తాన్కు సరఫరా చేసే గ్యాస్ను కంపెనీ నిషేధించింది.
దీంతో ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా యూఏఈ ఇచ్చిన షాక్ తో ఇమ్రాన్ కు కళ్లు బైర్లు కమ్మాయి. యూఏఈ గతంలో వంద బిలియన్ డాలర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ లో డిపాజిట్ చేసింది. ఇప్పుడు మెచ్చూరిటీ పీరియడ్ పూర్తికావడంతో.. ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని అడుగుతోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వంద బిలియన్ డాలర్లు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక ఇమ్రాన్ తలపట్టుకున్నాడు. ఇలా స్వదేశంతో పాటు.. అటు విదేశాల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్న ఇమ్రాన్ పై సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆహారం, ఆరోగ్యం, విద్య ఇలా చాలా రంగాల్లో పరిపాలన ఏమాత్రం బాలేదంటూ.. సాద్ అలావీ అనే ఓ మ్యుజీషియన్ ఆ వీడియోలో సాంగ్ రూపంలో విమర్శించారు. అందులో.. “ముందుగా మీరు కంగారు పడవద్దు” అని ఓ సందర్భంలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలతో ఆ వీడియో మొదలవుతోంది. దేశంలో ఆహారం, విద్య, ఆరోగ్యం ఏమీ లేకపోయినా.. ఆకలితో చావాలి తప్ప.. ఆందోళన చెందవద్దంటు సెటైరికల్ గా లిరిక్స్ రాశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి..!