భారత్- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. ఓల్డ్ ట్రఫోర్ట్ మైదానంలో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ రద్దు అయింది. మ్యాచ్కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు కరోనా మహమ్మారి బారిన పడడంతో మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తొలుత ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చాకే మ్యాచ్పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐతో చర్చించిన అనంతరం ఏకంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారత శిబిరంలో కరోనా కలకలం కారణంగా ఐదో టెస్టు జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ వెంటాడింది. నాలుగో టెస్టుకు ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రీతో పాటు మరికొందరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారు ఆ టెస్టుకు దూరం అయ్యారు. ఆ తర్వాత మరో సహాయక సిబ్బందికి కరోనా సోకింది. దాంతో గురువారం జట్టు సభ్యులందరికీ కరోనా టెస్టు నిర్వహించారు. సభ్యులందరకీ నెగెటివ్ రావడంతో మ్యాచ్ జరగొచ్చని భావించారు. కానీ, చివరి నిమిషంలో ఇరు జట్లు తొలి రోజు ఆటను రద్దు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు జట్ల బోర్డులు కూడా అంగీకారం తెలిపాయి. ఆ తర్వాత మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది.