క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడే ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టీమ్ ఇండియా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎ రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, విహారీ, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఇశాంత్ శర్మ , మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ సిరీజ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 21 ఫైనల్ లో భాగం అవ్వనున్నారని బీసీసీఐ తెలిపింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ లో అడుగుపెట్టిన భారతజట్టు సుదీర్ఘ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. నెట్స్ లో కష్టపడడమే కాకుండా.. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ లలో కూడా ఆటగాళ్లు తలపడ్డారు.
జూన్ 18 నుండి సౌతాంప్టన్లోని ది ఏజెస్ బౌల్లో భారత్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తలపడనుంది. మంగళవారం నాడు కివీస్ కూడా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్తో ముగిసిన సిరీస్లో రెండో టెస్టుకు దూరమైన కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కోలిన్ డి గ్రాండ్హోమ్ను స్పెషలిస్ట్ ఆల్ రౌండర్గా జట్టులో చేరాడు. అజాజ్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నారు. టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్ మరియు డెవాన్ కాన్వే తమ స్థానాలను నిలబెట్టుకోగా, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ లను తప్పించారు.
1999 తర్వాత ఇంగ్లాండ్లో తొలి సారి టెస్ట్ సిరీస్ గెలిచిన ఊపులో న్యూజిలాండ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. మోచేయి గాయం కారణంగా ఎడ్జ్బాస్టన్ టెస్ట్ నుండి వైదొలిగిన విలియమ్సన్, వెన్నునొప్పితో తప్పుకున్న వాట్లింగ్ కోలుకున్నారని భావిస్తున్నామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు.
కివీస్ స్క్వాడ్: కేన్ విలియమ్సన్ (సి), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, రాస్ టేలర్, నీల్ వాగ్నెర్, బిజె వాట్లింగ్, విల్ యంగ్