దేశంలో వాడుకలోకి కొత్త కాయిన్.. పార్లమెంట్ ప్రారంభోత్సవంలో విడుదల చేయనున్న మోదీ..!

0
325

భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది. గతంలో పాత 500, వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్రం.. ఇటీవలే 2 వేల నోట్ల రద్దు ప్రకటించింది. అయితే తాజాగా 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్​, 5శాతం జింక్​తో 75 రూపాయిల నాణెం తయారు చేయనున్నారు. నాణెం 44mm సైజులో ముద్రించారు.

అశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం దాని కింద ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉండనున్నాయి. నాణేనికి ఎడమవైపు దేవనగరి లిపిలో భారత్​, కుడివైపు ఆంగ్లంలో ఇండియా అని ఉండనుంది. కాయిన్​ ఎగువ అంచుపై సంసద్​ సంకుల్​ అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్​లో రూ. 1, రూ. 2, రూ. 5 , రూ.10, రూ.20 కాయిన్లు వాడకంలో ఉన్నాయి. త్వరలోనే వంద రూపాయల కాయిన్​ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

అయితే ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమంతో వేడుక మొదలు కానుంది. ఈ వేడుక హవన్, పూజతో ప్రారంభమమై, ప్రధాని మోదీ ప్రసంగంతో ముగుస్తుంది. ఈ పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగనున్నాయి. 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్‌‌ని లోక్‌సభలో పొందుపరచనున్నారు.

ఇక ఉదయం 9:30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పురోహితులు, సాధువులు పాల్గొనే ప్రార్థనా సభ జరుగుతుంది. ఆ తర్వాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్ జరుగుతుంది. అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు. రాజ్యసభలో కూడా సందేశాన్ని వినిపిస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ 75 రూపాయల కాయిన్‌, స్టాంప్ విడుదల చేస్తారు. 2:30 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here