ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. రవి బిష్ణోయ్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ సులభమైన క్యాచ్ ను వదలేయడంతో బతికిపోయిన ఆసిఫ్ అలీ పాక్ ను గెలిపించాడు. కీలక సమయంలో అంత సులువైన క్యాచ్ వదిలేసిన అర్ష్ దీప్ భారత్ ఓటమికి కారణమయ్యాడంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్న అర్ష్ దీప్ సింగ్ కు భారత మాజీ క్రికెటర్లు అండగా నిలిచారు.
ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్లను వదలరని, యువ బౌలర్ ను తిట్టొద్దని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ న్నాడు. ‘యంగ్ స్టర్ అర్ష్ దీప్ ను విమర్శించడం మానేయండి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ను వదిలేయరు. మన ఆటగాళ్ల గురించి మనం గర్వపడాలి. ఆ రోజు పాకిస్థాన్ బాగా ఆడింది అంతే. సోషల్ మీడియా వేదికగా చౌకబారు మాటలతో అర్ష్ దీప్, జట్టును తిట్టడం సిగ్గుచేటు. అర్ష్ దీప్ బంగారం’ అని హర్భజన్ ట్వీట్ చేశాడు. భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అర్ష్ దీప్ కు మద్దతు తెలిపాడు. యువ బౌలర్ ది బలమైన వ్యక్తిత్వం అన్నాడు. అతడిని అలానే ఉంచాలని అభిమానులకు సూచించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అర్ష్ దీప్ కు తన మద్దతును తెలిపాడు. ‘అధిక ఒత్తిడితో కూడిన ఇలాంటి మ్యాచ్ ల్లో తప్పులు జరుగుతుంటాయి. నా మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ లో భాగంగా నేను షాహిద్ అఫ్రిది బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి ఔటయ్యా. దాంతో, ఆ రోజు ఉదయం 5 గంటల వరకు నాకు నిద్ర పట్టలేదు. అక్కడితోనే నా కెరీర్ ముగిసిందని అనుకున్నానని కోహ్లీ తెలిపాడు.
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ కు సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేశారు. అర్షదీప్ వికీపీడియా పేజీలో ఖలిస్థాన్ జాతీయ జట్టు పేరును ఎడిట్ చేశారు. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్ లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది.