More

    భారత్‎ను కవ్విస్తే పాకిస్తాన్ ఖతమే..!
    యూఎస్ ఇంటలిజెన్స్ రిపోర్ట్

    మీ హెచ్చరికలకు భయపడటానికి ఇది 1962 భారత్ కాదు, 2017 భారత్. ఆ ఏడాది జూన్‎లో చైనాను ఉద్దేశించి.. అప్పటి రక్షణమంత్రి, దివంగత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలివి. ఏ నయా భారత్ హై.. ఘర్ మే గుసేగా ఔర్ మారేగా.. పాకిస్తాన్‎పై సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్న మాటలివి. వారన్నవి మాటలు మాత్రమే కాదు. అక్షర సత్యాలు కూడా. ఇది నిజంగానే నయా భారతం. శత్రువు బెదిరింపులకు వణికిపోయే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు. అది చైనా అయినా.. పాకిస్తాన్ అయినా.. అగ్రరాజ్యం అమెరికా అయినా. ఓ తాజా తెలుగు సినిమా ట్రైలర్‎లో చెప్పినట్టు.. తగ్గేదే లేదంటోంది భారత్. ఇదేదో మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్న మాటలు కావివి. ఏ దేశానికి తలొగ్గని అమెరికా కూడా ఇదే మాట అంటోంది.

    తాజాగా యూఎస్ ఇంటలిజెన్స్ రిపోర్టులో.. భారత్ – చైనా, భారత్ – పాకిస్తాన్ సంబంధాలపై పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. భవిష్యత్తులో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య వైరం మరింత పెరగవచ్చని.. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరవచ్చని నివేదిక అంచనావేసింది. అయితే, భారత్ మునుపటిలా లేదని, పాక్‌ కవ్వింపు చర్యలకు కళ్లు బైర్లు కమ్మేలా సమాధానం ఇచ్చే స్థితిలో వుందని తేల్చింది. ఈ రెండు దేశాల మధ్య విభేదాలు యావత్‌ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయంటూనే.. పాకిస్తాన్ కు భారత్ బుద్ధి చెబుతుందని వెల్లడించింది. అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్.. ప్రపంచ దేశాల ముప్పు అంచనాపై వార్షిక నివేదికలు ఇస్తూ వుంటుంది. ఈ క్రమంలో తాజాగా యూఎస్‌ కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించింది. ఇందులో భారత్‌-పాక్‌, భారత్‌-చైనా ఉద్రిక్తతలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేనప్పటికీ.. ఉద్రిక్తతలు మాత్రం తీవ్రమవుతాయని అంచనావేసింది. ఒకవేళ పాకిస్తాన్‌ రెచ్చిపోతే మాత్రం.. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ తీవ్రంగా స్పందించే అవకాశం వుందని.. గతంలో కంటే కూడా ఎక్కువ సైనిక శక్తితో స్పందించే అవకాశముందని యూఎస్ ఇంటలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది.

    2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా మారుస్తూ.. మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఉగ్రవాదులుకు, వారికి వంతపాడుతున్న వర్గాలకు శరాఘాతంగా మారింది. ఇక, ఆర్టికల్ 370 రద్దుతో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు.. పాకిస్తాన్ ఎగిరెగిరిపడింది. ఆర్టికల్‌ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అంతర్జాతీయ వేదికపై భారత్‌పై నోరు పారేసుకుంది. అయితే పాక్ తీరును అంతర్జాతీయ సమాజం హర్షించలేదు సరికదా.. ఛీకొట్టింది. దీంతో ఉగ్రవాద దేశానికి భంగపాటు తప్పలేదు. ఇంత జరిగినా సత్సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా వున్నామని.. అయితే ఉగ్రవాదాన్ని తరిమికొడితేనే అది సాధ్యమని పాకిస్తాన్ కు భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయినా పెడదోరణి ప్రదర్శించిన ఉగ్రవాద దేశం పరిస్థితిని మరింత జఠిలం చేసింది.

    Related Stories