భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి క్వార్టర్స్ చేరిన అమ్మాయిలు.. అపజయమెరుగని ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు మహిళల విభాగంలో అద్భుతమైన జట్టు.. అలాంటి ఆసీస్ ను భారత మహిళలు ఓడించడం సరికొత్త చరిత్ర.. భారత పురుషుల జట్టు లాగే మహిళలు కూడా సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. గుర్జీత్ కౌర్ ఈ మ్యాచ్లో భారత్కు తొలి, ఏకైక గోల్ను అందించింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించడం గమనార్హం. ఇక క్వార్టర్స్కు ముందు పూల్ ‘ఎ’లో భారత్ లీగ్ దశలో రెండు మ్యాచ్ల్లో గెలిచి, మూడింటిలో ఓడింది. ఏడు గోల్స్ చేసి, 14 గోల్స్ సమర్పించుకుంది. ఇక పూల్ ‘బి’లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచిన సంగతి తెలిసిందే. అలాంటి జట్టును భారత్ ఓడించి ‘బిగ్గెస్ట్ అప్సెట్’ గా ఆసీస్ కు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ను ఒక్క గోల్ కూడా కొట్టనివ్వకుండా అడ్డుకోవడం హైలైట్ గా నిలిచింది.
ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్ పై నెగ్గింది. 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరింది. 1972 ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సెమీస్ చేరడం ఇదే ప్రథమం. టోక్యో ఒలింపిక్స్ లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.