కన్నుమూసిన స్వతంత్ర భారత తొలి ఓటర్ నేగి

0
704

భారతదేశంలో తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పలో 106 ఏళ్ల నేగి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేగి ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. 106 ఏళ్ల వయసులో నేగి ఓటేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ఆధునిక యువతకు నేగి స్ఫూర్తి అని ప్రధాని కొనియాడారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకోవాలని అధికారులు నేగికి సూచించారు. పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటేస్తానని నేగి వారికి స్పష్టం చేశారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. స్వతంత్ర్య భారత దేశానికి 1951 లో జరిగిన ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో నేగి ఓటేశారు. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నేగి మృతిపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు.