మన దేశ తొలి కరోనా పేషెంట్ గా కేరళకు చెందిన వైద్య విద్యార్థిని నిలిచిన సంగతి తెలిసిందే..! చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా పేషెంట్ గా గుర్తింపు పొందారు. 2020 జనవరి 30న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఆమె మరోసారి కరోనా బారిన పడ్డ విషయం తెలిసింది. 2020 జనవరిలో ఆమెకు కరోనా సోకింది. దీంతో నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమెతోపాటు వుహాన్కు వెళ్లిన మరో ఇద్దరు స్నేహితురాళ్లకు కూడా పాజిటివ్గా తేలింది. గతేడాది జనవరి 27నుంచి ఫిబ్రవరి 20 వరకు ఆమె 24 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంది.
ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేరళలోని త్రిసూర్ వైద్యాధికారులు వెల్లడించారు. ఆ విద్యార్థిని మరోసారి కరోనా బారిన పడ్డారని న్యూస్ ఏజెన్సీ పీటీఐతో త్రిసూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆమెలో కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం సదరు బాధితురాలు ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. బాధిత విద్యార్థినికి తొలిసారి కరోనా నిర్ధారణ అయినప్పుడు త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మూడు వారాల పాటు చికిత్స ఇచ్చారు. వైద్య పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ అని తేలిన తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఆమె తీసుకున్నట్లు చెప్పారు.