శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. భార్య, ఇద్దరు బాడీ గార్డ్స్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన పరారయ్యారు. శ్రీలంక సైన్యానికి అధిపతి కూడా అయిన దేశాధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాల ప్రకారమే ఆయన తరలింపు జరిగిందని ఆ దేశ వైమానిక దళం తెలిపింది. రాజపక్స స్వదేశం నుంచి పారిపోవడానికి భారత్ సాయం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది. ఈ ప్రచారం నిరాధారమైనదని తెలిపింది. రాజపక్స శ్రీలంక విడిచి వెళ్లిపోయే ప్రయాణాన్ని భారత్ సులభతరం చేసిందనే ప్రచారంలో నిజం లేదని ట్వీట్ చేసింది.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను నియమించారు. ఆందోళనకారుల నిరసనలతో లంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అధ్యక్షుడు పారిపోవడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఆందోళనకారులని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.