వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం తోక జాడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో చైనా సైన్యంను అడ్డుకునేందుకు ధీటుగా భారత్ బలగాలను మోహరించింది. ప్రస్తుతం చైనా సైన్యంపై భారత్ డ్రోన్ సహాయంతో నిఘాను పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ తమ అత్యాధునిక టెక్నాలజీ హెరాన్ డ్రోన్లతో చైనా సైనిక కార్యకలాపాలపై నిఘా ఉంచింది. అక్కడి ఏవియేషన్ బేస్ ఏఎల్హెచ్ ధృవ్ వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థను కూడా సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో తయారైన ఈ అత్యాధునిక హెరాన్ డ్రోన్లు నిఘా విషయంలో భారత్ కు ఎంతగానో ఉపయోగపడుతోంది. తొలిసారి వాడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిఘా వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తోందని భారత సైన్యం తెలిపింది. 30 వేల అడుగుల ఎత్తు వరకూ కూడా ఎగురుతూ.. నేల మీద ఉన్న కమాండర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయగలదు. 24 నుంచి 30 గంటలపాటు ఏకధాటిగా ఇది ఎగరగలదని భారత సైన్యం తెలిపింది.
భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చర్చలు సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు. కొద్దిరోజుల కిందట కమాండర్ స్థాయిలో భారత్.. చైనాల మధ్య జరిగిన 13 వ రౌండ్ చర్చలు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఎల్ఏసీ(LAC) ప్రక్కనే ఉన్న ప్రాంతాలు అదేవిధంగా ఇతర వివాదాస్పద భాగాలకు సంబంధించి తాము అనేక నిర్మాణాత్మక సూచనలు చేశామని, అయితే చైనా సైన్యం దీనికి అంగీకరించలేదని భారత సైన్యం తెలిపింది. ఎల్ఏసీలో ఈ ప్రతిష్టంభన పరిస్థితికి చైనా కారణమని భారత్ తెలిపింది.