More

    అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన భారత్

    అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ లో భారీ విజయం అందుకుంది. ఆంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ లో ఇంగ్లండ్‌తో తలపడనుంది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును వైస్ కెప్టెన్-కెప్టెన్ నిలబెట్టారు. మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 94 పరుగులు చేసి అవుట్ అవ్వగా, కెప్టెన్ యశ్ ధుల్ 110 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 110 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 290 పరుగులు చేరుకుంది. 291 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. కేంప్‌బెల్ కెల్లావే (30), కోరీ మిల్లర్ (38), లచ్లాన్ షా (51) మినహా మరెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా భారత్ స్పిన్ ముందు ఆసీస్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. 194 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో విక్కీ ఓస్వాల్ మూడు వికెట్లు తీసుకోగా, రవికుమార్, నిశాంత్ సింధు రెండేసి, కౌశల్ తాంబే, రఘువంశీ చెరో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ యశ్ ధుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

    96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో భారత్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. రెండు రోజుల క్రితం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి 24 ఏళ్ల తర్వాత అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది.

    Trending Stories

    Related Stories