భారత్, న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో ఉన్న సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆట నిలిపివేశారు. అప్పటికే ఆరోజుకు భారత్ 90 ఓవర్లు బౌలింగ్ చేసింది. కానీ ఇంకా డే ముగియడానికి సమయం ఉండగా వెలుతురు లేదని చెప్పి మ్యాచ్ ను డ్రా చేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 9 వికెట్లకు 165 పరుగులు. రచిన్ రవీంద్ర 18, అజాజ్ పటేల్ 2 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. రచిన్ రవీంద్ర భారత్ విజయానికి అడ్డుపడ్డాడు. 91 బంతులు ఆడిన రవీంద్ర 18 పరుగులే చేసినా, మరో వికెట్ పడకుండా ఆడి తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. టెయిలెండర్ అజాజ్ పటేల్ 23 బంతులు ఆడి 2 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ టామ్ లాథమ్ 52 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన విలియం సోమర్ విల్లే 36, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 24 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 296 పరుగులు చేసింది. కీలక ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో కివీస్ విజయలక్ష్యం 284 పరుగులు కాగా ఏ సమయంలోనూ లక్ష్యాన్ని చేధించాలని కివీస్ అనుకోలేదు. డ్రా కోసమే అన్నట్టుగా మరీ స్లోగా ఆడుతూ వచ్చి చివరికి ఒక్క వికెట్ తేడాతో డ్రా చేసుకుని ఊపిరి పీల్చుకుంది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి 7 వరకు ముంబయి వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఆ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ రానున్నాడు.