అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అనేక రంగాల్లో అగ్ర రాజ్యాలను సైతం దాటేసిన ఘనత ఇండియాది. అలాంటి మన దేశం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ తాజాగా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ వృద్ధి 2022లో 3.4 శాతం ఉండగా.. అది 2023 వార్షిక సంవత్సరంలో 2.9 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇది 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందని.. పుంజుకునేందుకు సమయం పడుతుందని వెల్లడించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే, అభివృద్ది చెందుతున్న దేశాలలో భారతదేశం ముందుందని.. 2024 ఆర్థిక సంవత్సరలో మళ్లీ 6.8 శాతానికి వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం.. అక్టోబర్ ఔట్లుక్తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి తమ వృద్ధి అంచనాలు మారలేదని ఐఎమ్ఎఫ్ అధికారి తెలిపారు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము 6.8 శాతం వృద్ధిని కలిగి ఉన్నామని.. ఇది మార్చి వరకు కొనసాగుతుందని చెప్పారు. ఆపై ఆర్థిక సంవత్సరంలో 2023లో 6.1 శాతంగా కొంత మందగమనాన్ని తాము ఆశిస్తున్నామన్నారు. ఇది చాలావరకు బాహ్య కారకాలతో ప్రభావితం అవుతుందని చీఫ్ ఎకనామిస్ట్, ఐ ఎమ్ ఎఫ్ పరిశోధన విభాగం డైరెక్టర్ ఒకరు చెప్పారు. భారతదేశంలో వృద్ధి రేటు 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి క్షీణిస్తుంది. 2024లో 6.8 శాతానికి చేరుకుంటుంది.. బాహ్య ప్రకంపనలు ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు.
అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, చైనా దేశాలతో పొలిస్తే భారత్ వృద్ధిలో ముందంజలో ఉన్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలలో భారత్ అగ్రభాగన ఉందని.. ఇదే మున్ముందు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత అంచనాలు చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. కోవిడ్-19 పరిమితుల సడలింపుల మధ్య 2023లో చైనాలో వృద్ధి 5.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని చెప్పింది. 2023లో ప్రపంచ వృద్ధిలో చైనా, భారతదేశం దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి. ఆసియాలో వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
అక్టోబర్ 2022 వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ లో అంచనా వేసిన దాని కంటే 2023 అంచనా 0.2 శాతం ఎక్కువగా ఉంది. సగటున 3.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు సెంట్రల్ బ్యాంక్ రేట్లు పెరగడం, ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తి కారణంగా 2022లో వృద్ధి తగ్గిందని పేర్కొంది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2022లో 8.8 శాతం నుంచి 2023లో 6.6 శాతానికి, 2024లో 4.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇప్పటికీ కరోనా మహమ్మారికి ముందు ఉన్న వృద్ధి కంటే దాదాపు 3.5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు ఐ ఎమ్ ఎఫ్ స్పష్టం చేసింది. తాజాగా వెలువడిన ఐ ఎమ్ ఎఫ్ నివేదికతో భారత్ సత్తా మరోసారి ప్రపంచ దేశాలకు తెలిసింది.