హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఉప ఎన్నిక బరిలోకి దింపుతుందన్న ఉత్కంఠకు తెరపడింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో పలు సార్లు అరెస్టయి జైలుకెళ్లారని.. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.
బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఉప ఎన్నిక కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గంపై ఇప్పటికే కేసీఆర్ వరాల జల్లును కురిపించారు. ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ బడా నేతలు కూడా హుజూరాబాద్ లో దిగిపోయారు. ఓట్లను కొనుక్కోడానికి కూడా టీఆర్ఎస్ నేతలు వెనకడుగు వేయడం లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కీలక నేతలు ఆ నియోజక వర్గంలో పర్యటనలు ప్రారంభించారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నేడు బైక్ ర్యాలీ నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈనెల 16వ తేదీన హుజురాబాద్ మండలం శాలపల్లిలో కేసీఆర్ సభ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ పరిశీలిస్తున్నారు. జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీ కూడా చేపట్టనున్నారు. వీణవంకలో టీఆర్ఎస్ సభ కూడా ఏర్పాటు చేసింది.