టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ చేరుకోలేకపోయింది. మొదటి లీగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. అయితే భారత్ లోని కొందరు పాక్ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాంటి వారిని గుర్తించిన అధికారులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన భార్య పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుందని.. భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. పాక్ గెలిచిందంటూ వారు సంబరాలు చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో షంగన్ఖేడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషాన్ మియా భార్య రబియా షంషీ మాత్రం పాక్కు మద్దతు తెలపడాన్ని అతడు అసలు సహించలేదు.. దీంతో భార్య మీదనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాక్ క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో రబియా తన కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి సెలెబ్రేట్ చేసుకుంది. పాక్ గెలిచిందంటూ వాట్సప్ స్టేటస్లోనూ పెట్టుకున్నారు. వారు చేసిన పనులకు ఇషాన్కు కోపం వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
దేశ ద్రోహం కేసులు పెడతాం: యోగి
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హెచ్చరించారు. టీ20 మ్యాచ్లో అక్టోబర్ 24న భారత్పై పాకిస్తాన్ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కశ్మీర్కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులను ఆగ్రాలో అరెస్ట్ చేశారు. పాక్ విజయం అనంతరం సంబరాలు జరుపుకున్న ఘటనలకు సంబంధించి ఆగ్రా, బరేలి, బదౌన్, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించడంతో.. శ్రీనగర్లో మెడికల్ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారు. మెడికల్ స్టూడెంట్స్ సంబరాలను నిరసిస్తూ కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.